ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో దారుణం చోటుచేసుకుంది. కుమ్మరరేవు ప్రాంతంలో ఆటవస్తువు గొంతులో ఇరుక్కొని నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు. బాలుడు నిరీక్షణ్ ఈ ఉదయం ఓ దుకాణంలో తినుబండారాల ప్యాకెట్ కొన్నాడు. ఆ ప్యాకెట్ను తెరిచి అందులోని తినుబండారాలను తిన్నాడు. వీటితోపాటు అందులో వచ్చిన ఓ ప్లాస్టిక్ ఆటవస్తువును కూడా గమనించక మింగాడు. దీంతో అది నోటిలో ఇరుక్కొని వూపిరాడని పరిస్థితి ఏర్పడింది. వెంటనే బాలుడి ఇబ్బందికర పరిస్థితిని గమనించిన తల్లిదండ్రులు సమీప ఆస్పత్రికి తరలించారు. అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
పిల్లలను ఆకర్షించేందుకు తినుబండారాల ప్యాకెట్లలో ఆటవస్తువులను పెట్టి అమ్ముతున్నారు. వీటిని గమనించక పిల్లలు బొమ్మలను నోటిలో పెట్టుకొని ప్రమాదాలకు గురవుతున్నారు.