ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జలదిగ్బంధంలో చెన్నపట్నం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Nov 01, 2017, 11:10 AM

భారీ వర్షాలు చెన్నై నగరాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. వరసగా మూడో రోజూ వర్షాలు కురుస్తుండటంతో నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. రోడ్లపై మోకాటి లోతు వరకు నీరు నిలవడంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లోని పలు ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. సోమవారం రాత్రి కురిసిన వర్షానికి నీరు అలాగే నిలిచి ఉండగా.. మంగళవారం ఉదయం మరోసారి వర్షం కురవడంతో ప్రజల ఇక్కట్లు మరింత ఎక్కువయ్యాయి.


ఉత్తర చెన్నైలోని పలు నివాస ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరింది. పెరంబూరు సమీపంలోని వ్యాసర్పాడి జీవా రైల్వే స్టేషన్‌ సబ్‌వేలోకి వర్షపు నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. నగరంలో సుమారు 500 చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కార్పొరేషన్‌ సిబ్బంది భారీ పంప్‌సెట్ల సాయంతో నీటిని తొలగించే పనులు చేపట్టారు. భారీ వర్షాల కారణంగా పలు స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు.


మరోవైపు తమిళనాడుకు సమీపంలో బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. ఆదివారం (అక్టోబర్ 29) శ్రీలంకకు సమీపంలో కేంద్రీకృతమైన ఉపరితల ద్రోణి సోమవారం పశ్చిమ దిశగా కదిలింది. దీంతో తమిళనాడులోని పది కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు, కడలూరు, నాగపట్నం, తిరువారూరు, తంజావూరు, రామనాథపురం జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com