ప్రతిష్ఠాత్మక బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో శివసేన సత్తా చాటుతోంది. చిరకాల మిత్రపక్షం భాజపాను వెనక్కి నెట్టి ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో తన పట్టు నిలుపుకొంది. మొత్తం 227 స్థానాలకు జరుగుతున్న ఓట్ల లెక్కింపులో కడపటి వార్తలందేసరికి ఆ పార్టీ 59 స్థానాల్లో విజయం సాధించింది. మరో 35 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక భాజపా రెండో స్థానంలో నిలిచింది. 35 స్థానాల్లో గెలుపొందిన ఆ పార్టీ మరో 38 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. కాంగ్రెస్కు ఈ ఎన్నికల్లో గట్టి చావుదెబ్బ తగిలింది. 17 స్థానాల్లో మాత్రమే గెలుపొందిన ఆ పార్టీ మరో 5 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఫలితాలు వ్యతిరేకంగా రావడంతో ఆ పార్టీ ముంబయి చీఫ్ సంజయ్ నిరుపమ్ తన పదవికి రాజీనామా చేశారు. ఇక శరద్పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ కేవలం ఆరు స్థానాలకే పరిమితమైంది. మొత్తంగా ఈ ఎన్నికల్లో భాజపాకు, శివసేనకు మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. పూర్తి ఫలితాలు ఇంకా వెలువడాల్సి ఉంది.