నంద్యాల పట్టణ నడిబొడ్డున ఉన్న శోభా హోటల్ ఆదివారం మధ్యాహ్నం ఒక్కసారిగా కుప్పకూలింది. అయితే ప్రమాద సమయంలో మెయిన్ రోడ్డుపై ఎలాంటి వాహనాలు కానీ, ప్రజలు కానీ తిరగకపోవటంతో పెద్ద ప్రమాదం తప్పింది. రోడ్ల విస్తరణ పనుల్లో భాగంలో ఇటీవల ఈ హోటల్ భవనాన్ని చాలా వరకు కూల్చేశారు. దీంతో ఈ భవనం నివాస యోగ్యం కాకపోవడంతో ఖాళీ చేశారు. ఆదివారం మధ్యాహ్నం ప్రభుత్వ కాంట్రాక్టర్లు తమ ఉద్యోగులతో ఎక్స్కవేటర్లతో కాలువ పనులు చేయిస్తున్నారు. శోభా హోటల్ ముందు భాగంలో కాలువ నిర్మాణ పనులు పూర్తి కావడంతో అక్కడ కాల్వ పూడ్చేందుకు ఎక్స్కవేటర్లతో పూడిక పనులు చేస్తున్నారు. అదే సమయంలో శోభా హోటల్ లాడ్జి ముందు భాగమంతా నాలుగు దఫాలుగా అంచలంచలుగా కూలిపోయింది. అదృష్టవశాత్తు ఆ సమయంలో ప్రజలు ఎవరూ తిరగకపోవడంతో పెద్దప్రమాదం తప్పిందని పోలీసులు పేర్కొన్నారు. శోభా లాడ్జి కూలిన సమయంలో ఆ ప్రదేశంలో ఒక కారు ఉన్నప్పటికీ పెద్దగా నష్టం వాటిల్లలేదు. ఇదిలా ఉండగా పట్టణ నడిబొడ్డిన ఈ సంఘటన జరగడంతో ప్రజలు బెంబేలెత్తిపోయారు.