ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘దలైలామాను కలవడం తీవ్రమైన నేరం’

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Oct 21, 2017, 02:38 PM

టిబెట్‌కు చెందిన బౌద్ధమత గురువు దలైలామాపై చైనాకు చెందిన ఓ నాయకుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఏ దేశమైనా దలైలామాకు ఆతిథ్యం ఇవ్వడం లేదా విదేశీ నేతలు ఆయనతో సమావేశమవడాన్ని తీవ్రమైన నేరంగా పరిగణిస్తామని హెచ్చరించారు. దలైలామా ఓ వేర్పాటువాది అని, టిబెట్‌ను చైనా నుంచి వేరు చేసేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.


దలైలామా విషయంలో గత కొంతకాలంగా చైనా చిర్రుబుర్రులాడుతున్న విషయం తెలిసిందే. ప్రపంచనేతలు ఆయనను కలవడంపై చైనా తరచూ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. అంతేగాక తమ దేశంతో దౌత్యపరమైన సంబంధాలు కొనసాగించాలంటే టిబెట్‌ చైనాలో ఒక భాగమేనని విదేశీ ప్రభుత్వాలు తప్పనిసరిగా గుర్తించాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే దలైలామాను కలవడం నేరమంటూ తాజాగా ఓ నాయకుడు వ్యాఖ్యానించారు. ‘ఏదైనా దేశం లేదా ఏదైనా సంస్థకు చెందిన వ్యక్తులు దలైలామాతో సమావేశమవడాన్ని తీవ్రమైన నేరంగా పరిగణిస్తాం. ఆయనో ఆధ్యాత్మిక నేత, ఆయనను కలుస్తాం అనే వాదనలను చైనా అంగీకరించదు. దలైలామా మతం ముసుగు కప్పుకున్న రాజకీయ నేత. మాతృభూమిని మోసం చేసి 1959లోనే మరో దేశానికి పారిపోయాడు. అక్కడే సొంత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. టిబెట్‌ను చైనా నుంచి వేరు చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు.’ అని చైనా కమ్యూనిస్ట్‌ పార్టీ యునైటెడ్‌ ఫ్రంట్‌ వర్క్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ మినిస్టర్‌ జాంగ్‌ యిజియాంగ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.


టిబెట్‌లో చైనా పాలనను వ్యతిరేకించిన దలైలామా 1959లో ఆ దేశాన్ని వదిలిపెట్టి భారత్‌లో తలదాచుకున్నారు. ఇటీవల ఆయన ఈశాన్య రాష్ట్రాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా భారత్‌పై చైనా తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com