కైరో: ఈజిప్టులోని గజా నగరంలో ఉగ్రవాదులతో జరిగిన పోరులో 50 మందికి పైగా పోలీస్ సిబ్బంది మృతిచెందారు. నగర సమీపంలోని ఎల్-వహాత్ ఎడారి ప్రాంతంలోని బహరియా ఓయాసిస్ వద్ద ఉగ్రవాదులు దాగి ఉన్నారనే సమాచారం రావడంతో పోలీసులు, భద్రతాసిబ్బంది అక్కడకు వెళ్లారు. తనిఖీలు చేస్తుండగా.. ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 50 మందికి పైగా పోలీసులు, భద్రతాసిబ్బంది మృతిచెందినట్లు అధికారులు వెల్లడించారు. మరికొందరు గాయపడ్డారు. కాగా.. ఎదురుకాల్పుల్లో కొందరు ముష్కరులు కూడా హతమైనట్లు ఈజిప్టు హోంమంత్రిత్వ శాఖ వెల్లడించింది. అయితే ఉగ్రవాదుల మృతుల సంఖ్యను గానీ.. వారి వివరాలను గానీ చెప్పలేదు.
కాల్పులకు పాల్పడింది తామేనంటూ తీవ్రవాద సంస్థ హసమ్ ప్రకటించింది. కాగా.. ఇటీవల ఈజిప్టులో భద్రతాసిబ్బందిపై ఉగ్ర దాడులు ఎక్కువయ్యాయి. 2013లో మహ్మద్ మోర్సీని ఈజిప్టు అధ్యక్షుడిగా తొలగించినప్పటి నుంచి ఆర్మీ, పోలీసులపై తీవ్రవాదులు తరచూ దాడులకు పాల్పడుతున్నారు. ఈ దాడుల్లో వందల సంఖ్యలో పోలీసులు, సైనికులు ప్రాణాలు కోల్పోతున్నారు.