పెషావర్: రెండేళ్ల క్రితం కిడ్నాప్ అయిన పాకిస్థాన్ జర్నలిస్టు జీనత్ షెహజాదీ ఆచూకీ చిక్కింది. పాక్, ఆఫ్ఘన్ బోర్డర్ సమీపంలో ఆమెను రెస్క్యూ చేసినట్లు అధికారులు తెలిపారు. భారత్కు చెందిన ఇంజినీర్ హమీద్ అన్సారీ కేసును రిపోర్ట్ చేస్తున్న జర్నలిస్టు జీనత్ను గత రెండేళ్ల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. గూఢచర్యం కేసు కింద హమీద్ను పాక్ పోలీసులు అరెస్టు చేశారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి అతను అక్రమంగా పాక్లోకి ప్రవేశించినట్లు సమాచారం.
అయితే హమీద్ కేసును జర్నలిస్టు జీనత్ రిపోర్ట్ చేసింది. డైయిలీ నహీ ఖబర్, మెట్రో న్యూస్ టీవీ ఛానల్కు.. 26 ఏళ్ల జీనత్ తన కథనాలను రిపోర్ట్ చేసేది. 2015లో లాహోర్లో ఆటోరిక్షాలో వెళ్తున్న ఆమెను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. గత ఏడాది మార్చిలో ఆమె సోదరుడు ఆత్మహత్య చేసుకున్నాడు. శిక్ష అనుభవిస్తున్న భారతీయ ఖైదీ స్వేచ్ఛ కోసం జర్నలిస్టు జీనత్ పోరాడిందని, ఆ కేసులోనే ఆమెను అడ్డుకునేందుకు ప్రయత్నాలు జరిగాయని, అందుకే ఆమెను ఎత్తుకెళ్లారని తెలుస్తున్నది. ప్రస్తుతం జర్నలిస్టు జీనత్ ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్తో కలిసిందని పాక్ మానవహక్కుల సంఘం పేర్కొన్నది.