తను రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రను చేపడుతున్నాను అని, అందుకు గానూ క్విడ్ ప్రో కో కేసుల్లో ప్రతివారం విచారణకు హాజరుకావాల్సి ఉండటం నుంచి మినహాయింపును ఇవ్వాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీబీఐ న్యాయస్థానంలో దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ పూర్తి అయ్యింది. వాదోపవాదాలు ముగిశాయి. ఇక కోర్టు తీర్పును ఇవ్వాల్సి ఉంది. తీర్పును ఈ నెల 23వ తేదీకి రిజర్వ్ చేసింది న్యాయస్థానం. ఆ రోజున జగన్ కు న్యాయస్థానం వ్యక్తిగత హాజరీ నుంచి మినహాయింపును ఇస్తే.. పాదయాత్ర సవ్యంగా జరిగే అవకాశం ఉంది. ఒకవేళ హాజరీ నుంచి మినహాయింపు దొరకకపోతే.. పాదయాత్ర సాగే అవకాశాలు తక్కువే. దీనిపై జగన్ పై కోర్టును ఆశ్రయించే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే పాదయాత్ర విషయంలో సస్పెన్స్ కొనసాగుతున్నట్టే.
విచారణ సందర్భంగా సీబీఐ కోర్టు కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. వారంలో ఆరు రోజుల పాటు పాదయాత్రను కొనసాగించి, ఒక రోజున కోర్టు విచారణకు హాజరు కావచ్చుగా.. అనే వ్యాఖ్య న్యాయమూర్తి నుంచి వినిపించింది. ఒక రోజు విశ్రాంతిని తీసుకున్నట్టుగా ఉంటుంది, కోర్టును గౌరవిస్తున్నాను అని ప్రజలకు చెప్పినట్టుగా ఉంటుందని.. న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.
అయితే విరామంతో పాదయాత్ర చేయడం వల్ల సమస్యలపై పోరాడుతున్న తీవ్రత తగ్గుతుందని జగన్ తరఫు న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు. విచారణ విషయంలో వ్యక్తిగత హాజరీ నుంచి మినహాయింపును ఇవ్వడం కోర్టు విచక్షణాధికారం అని న్యాయవాదులు పేర్కొన్నారు. అయితే సీబీఐ మాత్రం జగన్ వ్యక్తిగత హాజరీ నుంచి మినహాయింపును ఇవ్వొద్దనే వాదననే వినిపించింది.
ఈ వ్యవహారంలో వాదనలు అలా ముగియగా.. తీర్పును ఈ నెల 23వ తేదీకి వాయిదా వేసింది న్యాయస్థానం. ఆ రోజున పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ సీబీఐ కోర్టు మినహాయింపును ఇవ్వకపోతే జగన్ పై కోర్టుకు వెళ్లే అవకాశాలున్నాయి. ఒకవేళ మినహాయింపు లభించకపోతే జగన్ చేపట్టదలిచిన పాదయాత్ర అనుకున్న షెడ్యూల్ కు మొదలయ్యే అవకాశాలు ఉండవని మాత్రం స్పష్టం అవుతోంది.