న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘంపై మాజీ కేంద్ర మంత్రి చిదంబరం ఫైర్ అయ్యారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించడంలో కేంద్ర ఎన్నికల సంఘం కావాలనే జాప్యం చేస్తున్నదని ఆయన ఆరోపించారు. తేదీలను ప్రకటించేందుకు..ఈసీ తన సెలవులను పొడిగించుకున్నదని ఆయన ట్వీట్ చేశారు. ప్రధాని మోదీ తన చివరి ర్యాలీ నిర్వహించిన తర్వాతే ఈసీ ఎన్నికల తేదీలను ప్రకటిస్తుందని చిదంబరం విమర్శించారు. ప్రధాని మోదీ అన్ని రాజకీయ ప్రకటనలు చేసిన తర్వాత.. ఎన్నికల సంఘం గుజరాత్లో అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటిస్తుందని చిదంబరం వ్యంగ్యంగా పోస్ట్ చేశారు. ఎన్నికల తేదీలను ప్రకటిస్తే, క్రమశిక్షణా నియమావళి అమలులోకి వస్తుందని, అందుకే ఈసీ తేదీలను ప్రకటించకుండా ఆలస్యం చేస్తున్నదని చిదంబరం అన్నారు. వారం క్రితం హిమాచల్ప్రదేశ్ ఎన్నికల తేదీలను ప్రకటించిన ఈసీ.. గుజరాత్ తేదీలను వెల్లడించలేదు. కానీ హిమాచల్ ఫలితాల వెల్లడి తేదీలోపే గుజరాత్ ఎన్నికలు నిర్వహిస్తామని స్పష్టం చేసింది. దీంతో ఈసీ వైఖరిపై కాంగ్రెస్ తీవ్రంగా విమర్శలు చేస్తున్నది.