వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. శ్వేతసౌధంలోని ఓవల్ ఆఫీస్లో ట్రంప్.. భారత అమెరికన్ అడ్మినిస్ట్రేషన్ సభ్యులతో కలిసి దీపాలను వెలిగించారు. ఆ తర్వాత అధికారులతో కాసేపు సరదాగా ముచ్చటించారు. ఈ వేడుకల్లో ఐరాసకు అమెరికా రాయబారి నిక్కీ హేలీ, సెంటర్ ఫర్ మెడికేర్ అడ్మినిస్ట్రేటర్ సీమా వర్మ, యూఎస్ ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ ఛైర్మన్ అజిత్ పాయ్ తదితర భారత అమెరికన్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేడుకలకు సంబంధించిన వీడియోను ట్రంప్ తన ఫేస్బుక్ ఖాతా ద్వారా పంచుకున్నారు. ‘భారత-అమెరికన్ కమ్యూనిటీతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొనడం చాలా గర్వంగా ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యాన్ని నిర్మించిన గొప్ప ప్రజలు భారతీయులు. ఆ దేశ ప్రధాని మోదీతో ఉన్న బలమైన సంబంధాలకు నేను చాలా విలువిస్తున్నాను. మన భారత-అమెరికన్ సోదరులు, మిత్రులు అమెరికా ఉన్నతి కోసం ఎంతో కృషి చేస్తున్నారు. అమెరికాలోని సైన్యంలో పనిచేస్తున్న భారత పౌరులకు ఎల్లప్పుడూ కృతజ్ఞతలు. పీపుల్స్ హౌస్లో దీపావళి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. అమెరికాలో ఉండే ప్రతి ఒక్కరికీ, హిందువులకు దీపావళి శుభాకాంక్షలు. మీ డొనాల్డ్ ట్రంప్’ అని రాసుకొచ్చారు. మాజీ అధ్యక్షుడు జార్జ్ బుష్ తొలిసారిగా శ్వేతసౌధంలో దీపావళి వేడుకలు నిర్వహించారు. అయితే ఆయన స్వయంగా ఈ వేడుకల్లో పాల్గొనలేదు. ఆ తర్వాత అధ్యక్షుడిగా ఎన్నికైన ఒబామా స్వయంగా సంబరాల్లో పాల్గొని దీపాలను వెలిగించారు.