ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం పొందాలన్న ఇండియా కోరిక సహేతుకమైనదేనని, ఈ విషయమై తాము మద్దతిస్తామని అమెరికా ప్రకటించింది. అయితే, శాశ్వత సభ్య దేశాలుగా ప్రస్తుతం ఉన్న చైనా, రష్యాలు ప్రస్తుతమున్న సెక్యూరిటీ కౌన్సిల్ కు మార్పులు అవసరం లేదని భావిస్తున్నాయని, ఇండియాను కౌన్సిల్ లో చేర్చుకునే విషయమై రెండు దేశాలూ మరోసారి ఆలోచించాలని ఐరాసలో అమెరికా ప్రతినిధి నిక్కీ హేలీ వ్యాఖ్యానించారు. "ఏవైనా నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఇండియా తన 'వీటో' హక్కును వాడకుండా ఉంటామని ముందస్తు హామీ ఇస్తే, సెక్యూరిటీ కౌన్సిల్ లో శాశ్వత సభ్యత్వం రావడం సులువవుతుందని అన్నారు. ప్రస్తుతం శాశ్వత సభ్యదేశాలుగా ఉన్న అమెరికా, రష్యా, బ్రిటన్, చైనా, ఫ్రాన్స్ ల్లో చైనా, తన వీటో హక్కును అధికంగా వాడుతోంది" అని హేలీ వ్యాఖ్యానించారు. భద్రతా మండలిలో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని, ఎన్నో దేశాలు ఇదే అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నాయని అన్నారు. కాగా, గత నెలలో ఇండియా, జర్మనీ, బ్రెజిల్, జపాన్ (జీ-4) దేశాల విదేశాంగ మంత్రులు న్యూయార్క్ లో సమావేశమైన వేళ భద్రతా మండలి విస్తరణ, శాశ్వత సభ్య దేశాల పెంపు తదితరాంశాలపై చర్చలు జరిపిన సంగతి తెలిసిందే.