ప్రధాని నరేంద్రమోడీ గుజరాత్ లో కాంగ్రెస్ పై నిప్పులు చెరిగారు. మరో నెల రోజుల్లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడ ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ ను టార్గెట్ చేశారు. ఆ పార్టీ దేశానికి, అభివృద్ధికి శత్రువని చెప్పారు. ఏ ఎన్నికల్లో అయినా అభివృద్ధే తమ నినాదం అని మోడీ స్పష్టం చేశారు.అహ్మదాబాద్ లో గుజరాత్ గౌరవ యాత్ర పేరిట జరిగిన సభలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. కాంగ్రెస్ పై అవినీతి పార్టీగా ముద్రవేశారు. దేశ రాజకీయాలను దిగజార్చిన ఘనత కాంగ్రెస్ కే దక్కుతుందని అన్నారు. మతతత్వ, విభజన రాజకీయాలకే తప్ప అభివృద్ధి ప్రాతిపదికన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో పోటీ చేయదని విమర్శించారు. ప్రాజెక్టులు ప్రారంభించి వదిలేయటమే కాంగ్రెస్ కు తెలుసని, కానీ తాము మాత్రం నెహ్రూ కాలం నాటి ప్రాజెక్టులను కూడా పూర్తి చేస్తూ ఆయన కలను నెరవేర్చుతున్నామని చెప్పారు.
పెద్ద నోట్ల రద్దు, జి.ఎస్.టి పై వస్తున్న విమర్శలపై కూడా ప్రధాని మోడీ స్పందించారు. జి.ఎస్.టి ని కాంగ్రెస్ పార్టీయే ప్రతిపాదించిందని ఈ నిర్ణయాన్ని అన్ని రాష్ట్రాలు తీసుకున్నాయే తప్ప కేంద్రం కాదని చెప్పారు. జి.ఎస్.టి విషయంలో వస్తున్న విమర్శల నేపథ్యంలో దాన్ని కాంగ్రెస్ కు అంటగట్టే ప్రయత్నం చేశారు మోడీ. నోట్ల రద్దు కారణంగా బ్లాక్ మనీ బయటపడిందని, కాంగ్రెస్ వాళ్లు మాత్రం డిమానిటైజేషన్ ను బ్లాక్ డే అని అభివర్ణిస్తున్నారని విమర్శించారు.20 ఏళ్లకు పైగా గుజరాత్ లో బీజేపీయే అధికారంలో ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ వ్యతిరేకత సహా పార్టీపై కొన్ని విమర్శలు వచ్చాయి. దీంతో సొంత రాష్ట్రంలో పార్టీని ఎలాగైనా అధికారంలోకి తేవాలని మోడీ చెమటోడుస్తున్నారు. ఈ నేపథ్యంలో గత నెల రోజుల్లోనే ఆయన నాలుగు సార్లు గుజరాత్ లో పర్యటించారు.ఈ సభలో గుజరాత్ సీఎం విజయ్ రూపానీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా, మాజీ సీఎం ఆనంది బెన్ పటేల్ సహా పలువురు బీజేపీ నేతలు హాజరయ్యారు. ఈసారి 150 స్థానాలు దక్కించుకుంటామని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు.