ఎన్టీఆర్ బయోపిక్ పై అతిగా స్పందించవద్దని టీడీపీ శ్రేణులకు సీఎం చంద్రబాబునాయుడు సూచించారు. ఈ రోజు పార్టీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించనున్న బయోపిక్ గురించి ఆయన ప్రస్తావించారు. ఎన్టీఆర్ కారణజన్ముడని, సినిమా, రాజకీయ రంగాలకు ఆయన సేవలను తెలుగుజాతి ఎన్నటికీ మరవదని అన్నారు. కాగా, వర్మ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ గురించీ చంద్రబాబు ప్రస్తావించారు. వైసీపీ నేతలు రామ్ గోపాల్ వర్మ ను కలవడాన్ని ప్రజలు గమనిస్తున్నారని, టీడీపీ నేతలు, కార్యకర్తలు ఈ సినిమాపై స్పందించాల్సిన అవసరం లేదని సూచించినట్టు సమాచారం.