ట్రెండింగ్
Epaper    English    தமிழ்

1500 ఎకరాల్లో బంగారు నిక్షేపాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 16, 2022, 04:15 PM

కర్నూలు జిల్లా జోన్నగిరి సమీప జో గోల్డ్‌ మైన్ బంగారం నిక్షేపాల వెలికితీతకు జియో మైసూర్‌ సంస్థ ముందుకొచ్చింది. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలోని జొన్నగిరి సమీపంలో బంగారం వెలికితీత పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. పైలట్‌ ప్రాజెక్ట్‌ మంచి ఫలితాలు ఇవ్వడంతో గోల్డ్‌ మైన్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు జియో మైసూర్‌ సంస్థ ముందుకొచ్చింది.


ప్లాంట్‌ను నెలకొల్పి ఏడాదిలోపు బంగారం నిక్షేపాల వెలికితీత పనులు చేపట్టనుంది. జిల్లాలోని తుగ్గలి, మద్దికెర మండలాల్లో బంగారు నిక్షేపాలు పుష్కలంగా ఉన్నాయని 1994లోనే జియాలజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (జీఎస్‌ఐ) సర్వే ద్వారా నిర్ధారించింది.


ప్రస్తుతం జియో మైసూర్‌ సంస్ధ ఈ ప్రాంతంలో గోల్డుమైన్‌ చేపట్టేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి పొందింది. జొన్నగిరి, పగిడిరాయి గ్రామ సరిహాద్దుల్లో ఉన్న దోన ప్రాంతం మైనింగ్‌కు ప్రధాన కేంద్రం, గతంలో ఇక్కడ బ్రిటీష్‌ హాయంలోనే బంగారు గని తవ్వకాలు జరిపిన అనవాళ్లు సైతం ఉన్నాయి. ఈ ప్రాంతంలో సుమారు 1500 ఎకరాల్లో బంగారు నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించారు.


భారత ప్రభుత్వం మైనింగ్‌ సెక్టార్‌లో విదేశీ పెట్టుబడులు ఆహ్వానించిన తర్వాత 2005లో జియో మైసూర్‌ అనే సంస్థ జొన్నగిరి సమీపంలో గోల్డ్‌ మైన్‌ నిర్వహణకు దరఖాస్తు చేసింది. దరఖాస్తును అప్పటి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం పరిశీలించింది. అనుమతులు ఇచ్చేలోపే ప్రమాదవశాత్తు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మృతి చెందారు.


ఆపై రాష్ట్ర విభజన సమస్య, రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితులను నేపథ్యంలో మైనింగ్‌ అనుమతులకు ఆటంకం ఏర్పడింది. ఎట్టకేలకు 2013లో అనుమతులు లభించగా.. 2014లో జియో మైసూర్‌ సంస్థ బంగారం నిక్షేపాలపై అన్వేషణ మొదలు పెట్టింది.


తుగ్గలి, మద్దికెర మండలాల్లో 350 ఎకరాలను జియో మైసూర్‌ సంస్థ కొనుగోలు చేసింది. మరో 1,500 ఎకరాలను లీజుకు తీసుకుంది. రైతులకు ఏటా ఎకరానికి రూ. 15 వేల చొప్పున కౌలు చెల్లిస్తోంది. కొనుగోలు చేసిన 350 ఎకరాల్లో మైనింగ్, ప్రాసెసింగ్‌ యూనిట్, డంప్‌ యార్డ్, వాటర్‌ రిజర్వాయర్‌ నిర్మించారు.


దీనికి రూ. 95 కోట్ల వరకూ సంస్థ ఖర్చు చేసింది. పైలట్‌ ప్రాజెక్టులో భాగంగా 1,500 ఎకరాల్లో ప్రతి 20 మీటర్లకు ఒక డ్రిల్లింగ్‌ చొప్పున మొత్తం 30 వేల మీటర్ల మేర డ్రిల్లింగ్‌ చేయించింది. బంగారం లభ్యత, నాణ్యత, మైనింగ్‌ చేస్తే వచ్చే లాభనష్టాలు తదితర అంశాలను అంచనా వేసేందుకు పైలట్‌ ప్రాజెక్ట్‌ చేపట్టింది. ఇది ఫలించడంతో పూర్తిస్థాయిలో ప్లాంట్‌ ఏర్పాటుకు సిద్ధమైంది.


ఇందుకు అవసరమైన యంత్ర సామగ్రి కొనుగోలు చేస్తోంది. ఏప్రిల్‌ నుంచి ప్లాంట్‌ నిర్మాణ పనులు ప్రారంభించి 12 నెలల్లో పూర్తి చేయనుంది. ఇందుకోసం రూ. 300 కోట్లు వెచ్చిస్తోంది. ప్లాంట్‌ పనుల పురోగతిని జిల్లా కలెక్టర్, పరిశ్రమల శాఖ రాష్ట్ర ప్రతినిధులు ప్రతి వారం సమీక్షిస్తున్నారు.


స్వాతంత్య్రం తర్వాత దేశంలో తొలి గోల్డ్‌ మైన్‌ మన దేశంలో 1880లో కోలార్‌ గోల్డ్‌ మైన్‌ ప్రారంభమైంది. స్వాతంత్య్రం వచ్చాక ఇప్పటివరకు దేశంలో ఎక్కడా గోల్డ్‌ మైనింగ్‌ చేపట్టలేదు. ఇప్పుడు జియో మైసూర్‌ సంస్థ ఏర్పాటు చేస్తున్నదే తొలి గోల్డ్‌ మైనింగ్‌ ప్లాంట్‌ కానుంది. దీని నిర్మాణంతో ప్రత్యక్షంగా 300 మందికి, పరోక్షంగా మరో 1000 మంది వరకు ఉపాధి లభిస్తుంది.


ప్రస్తుతం మైనింగ్‌ ప్రాంతంలో కర్మాగారం ఏర్పాటు చేయనున్నారు. పూర్తి స్థాయిలో ప్లాంట్‌ ఏర్పాటుకు సిద్దమైంది. ఇందుకు అవసరమైన యంత్ర సామాగ్రి కొనుగోలు చేస్తుంది. ఇందులో భాగంగా తొలిబ్లాక్‌లో ముందుగా బంగారు గనుల తవ్వకం ప్రారంభించి, తర్వాత మరో మూడు బ్లాక్‌లలో మైనింగ్‌ చేయాలన్నది సంస్ధ నిర్ణయం.


మొత్తం నాలుగు బ్లాక్‌లు కలిపి సుమారు 30 నుంచి 40 టన్నుల బంగారు నిక్షేపాలను వెలికి తీయవచ్చని అంచనా వేస్తున్నారు. సదరు సంస్ధ ప్రతి ఏటా 750 కేజీల బంగారం తీయాలని లక్ష్యంగా పెట్టుకుంది.


వాస్తవానికి ఈ ప్రాజెక్టు 2020లోనే ప్రారంభం కావాలి. అయితే అనుమతులు లేటు కావడం, కోవిడ్‌ కారణంగా వాయిదా పడింది. 2022 ఏప్రిల్ తర్వాత గనుల తవ్వకం చేపట్టేందుకు జియో మైసూర్‌ సంస్ధ సిద్దమవుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com