పంబ: కేరళలోని శబరిమల ఆలయాన్ని ఇవాళ ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్ సందర్శించారు. ఆలయంలో ఏర్పాట్లు, వసతులపై ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. మూడు నెలల పాటు సాగే అయ్యప్ప మండల దీక్ష కోసం భారీగా భక్తులు రానున్నారు. ఈ నేపథ్యంలో సీఎం విజయన్.. అక్కడి మౌళిక సదుపాయాల గురించి సమీక్ష నిర్వహించారు. భారీగా వర్షం పడుతున్నా.. సీఎం విజయన్ 8 కిలోమీటర్ల గుట్టను కాలినడక ద్వారా ఎక్కారు. దాదాపు 90 నిమిషాలు ఆయన కాలి నడక ద్వారా ఆలయాన్ని చేరుకున్నారు. మొదట్లో కొంత ఉద్రేకం కలిగినా.. చివరకు ఓ మంచి అనుభవం మిగిలిందన్నారు. శబరిమల సమూల ప్రక్షాళనకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం విజయన్ తెలిపారు. నవంబర్ నుంచి జనవరి వరకు మండల దీక్ష భక్తులు భారీ సంఖ్యలో వస్తుంటారు. ఈ నేపథ్యంలో అక్కడ విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. దేవాదాయ శాఖ మంత్రి సురేంద్రన్, ప్రధాన అర్చకుడు ఉన్నికృష్ణన్ నంబూద్రి కూడా సీఎంతో ఉన్నారు. అయ్యప్ప సన్నిధానంలో పుణ్యదర్శనం కాంప్లెక్స్, వాటర్ ట్యాంక్ కోసం సీఎం విజయన్ శంకుస్థాపన చేశారు.