విశాఖపట్నం: భారత రక్షణరంగం అమ్ముల పొదిలో మరో అస్త్రం చేరింది. శత్రు జలాంతర్గాముల ఉనికి గుర్తించి వాటిని నిరోధించడానికి ఐఎన్ఎస్ కిల్టన్ని విశాఖలో నిర్మించారు. ప్రధాని మోదీ చేపట్టిన ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమంలో భాగంగా రక్షణశాఖలో ఈ యుద్ధనౌకను తయారు చేశారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో దీన్ని తయారు చేయడం విశేషం. దీంతో రక్షణరంగం బలోపేతం అవుతుందని రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. శివాలిక్ శ్రేణి, కోల్కతా శ్రేణి, సోదరీ నౌకలయిన ఐఎన్ఎస్ కమోర్త, కద్మత్ తర్వాత నూతన శ్రేణి యుద్ధ నౌకగా కిల్టన్ని తయారు చేశారు. విశాఖ డాక్యార్డు నుంచి కిల్టన్ సముద్రంలోకి జలప్రవేశం చేసింది. భవిష్యత్తులో ఉపరితలం నుంచి ఆకాశానికి తీసుకెళ్లే ఏఎస్డబ్లు హెలికాఫ్టర్లను మోసుకెళ్లడానికి ఇది ఉపయోగపడుతుంది. దీంట్లో టార్పెడోలు, ఏఎస్డబ్ల్యూ రాకెట్లు, మీడియం రేంజ్ గన్ల వంటి అధునాతన పరికరాలు ఉన్నాయి. మినికాయ్, లక్షద్వీప్లోని దీవుల పేరు మీద నౌకకు కిల్టన్ అని నామకరణం చేశారు. 1971లో ఇండో-పాక్ యుద్ధంలో యూఎస్ఎస్ఆర్ రూపొందించిన కిల్టన్(పి79) పేరు కూడా ఇదే కావడం గమనార్హం. ఈ కార్యక్రమంలో నౌకాదళపతి సునీల్ లంబా, తూర్పు నౌకాదళ అధికారి బిస్త్ పాల్గొన్నారు.