ప్రైవేటు కళాశాలల్లో విద్యార్థుల వరుస ఆత్మహత్యల నియంత్రణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నడుం బిగించింది. విద్యార్థుల బలవన్మరణాలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రితో రాష్ట్రంలోని ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు సోమవారం సమావేశమయ్యాయి. ఇటీవల కాలంలో రాష్ట్రంలోని పలు ప్రైవేటు కళాశాలల్లో విద్యార్థుల ఆత్మహత్యలు ఎక్కువ అయ్యాయి. ఇందుకు కారణాలను ఈ సమావేశంలో చర్చించారు. చంద్రబాబుతో సమావేశమైన చక్రపాణి కమిటీ సిఫార్సుల అమలుపై కూడా చర్చిస్తున్నారు. మంత్రి గంటా శ్రీనివాసరావు, విద్యాశాఖ అదికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
విద్యార్థులపై చదువుల ఒత్తిడి పెంచడం సరికాదని చంద్రబాబు అన్నారు. విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమైనవారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అధికారులు, కళాశాలల యాజమాన్యాలతో కమిటీ ఏర్పాటుకు నిర్ణయంచారు. నెలకోసారి కమిటీతో, 3 నెలలకోసారి కళాశాలల ప్రతినిధులతో సమీక్ష జరుతామని అన్నారు. విద్యార్థులను రోబోలుగా మార్చే విద్యావిధానాన్ని అసలు సహించనని చంద్రబాబు అన్నారు. కార్పొరేట్ కళాశాలలు స్వీయనియంత్రణ పాటించాలని, విద్యార్థులను వేధించే పద్ధతులకు స్వస్తి చెప్పాలని, నాలుగైదు రోజుల్లో మార్పు కనిపించాలని చంద్రబాబు ఆదేశించారు. విద్యార్థుల సోషల్వర్క్కు 5 శాతం మార్కులు తప్పనిసరని సీఎం స్పష్టం చేశారు.