లాహోర్: ఎట్టకేలకు పాక్ వెళ్లి ఆడేందుకు శ్రీలంక క్రికెటర్లు ఒప్పుకున్నారు. పాక్-శ్రీలంక మధ్య ప్రస్తుతం 5 వన్డేల సిరీస్ కొనసాగుతోంది. అబుదాబి వేదికగా ఈ మ్యాచులు జరుగుతున్నాయి. ఈ సిరీస్ అక్టోబరు 23తో ముగియనుంది. అనంతరం 26 నుంచి ఇరు జట్ల మధ్య టీ20 సిరీస్ ప్రారంభంకానుంది. సిరీస్లో భాగంగా అక్టోబరు 29న చివరి టీ20కి పాకిస్థాన్లోని లాహోర్ వేదికగా నిశ్చయించారు.
పాక్ వెళ్లి ఆడలేమని సుమారు 40మంది శ్రీలంక క్రికెటర్లు తమ బోర్డుకు తెలిపారు. దీంతో లంక బోర్డు ప్రతినిధులు ఐసీసీ నిర్వాహకులతో చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఐసీసీ సిబ్బంది మ్యాచ్ జరిగే లాహోర్లోని గడాఫీ స్టేడియాన్ని పరిశీలించారు. అనంతరం పాక్ క్రికెట్ బోర్డు అధికారులతో చర్చించారు. అన్ని అంశాల పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన ఐసీసీ.. మరోమారు శ్రీలంక బోర్డు అధికారులతో మాట్లాడింది. అనంతరం అధికారులు.. ఆటగాళ్లతో చర్చించి పాక్ వెళ్లేందుకు సుముఖంగానే ఉన్నట్లు ప్రకటించారు. 2009 మార్చిలో పాక్లో పర్యటిస్తున్న శ్రీలంక క్రికెటర్ల బస్సుపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో ఇద్దరు పోలీసులు, ఒక పౌరుడు ప్రాణాలు కోల్పోయారు. ఆరుగురు క్రికెటర్లు, ఇద్దరు సిబ్బంది, ఒక అంపైర్ గాయపడ్డారు. అప్పటి నుంచి ఐసీసీ పాక్లో మ్యాచులు నిర్వహించేందుకు విముఖత వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.