అమరావతి: ఐటీ సంస్థలకు రానున్న కాలంలో 21 రోజుల్లోనే కార్యాలయం స్థలంతో పాటు అన్ని అనుమతులు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని మంత్ని నారా లోకేశ్ తెలిపారు. గతంలో ఐటీ సంస్థలకు అనుమతులతో పాటు కార్యాలయ స్థలం ఇవ్వాలంటే సంవత్సరం పట్టేదని, ఇప్పుడు 50 రోజుల్లోనే అన్ని అనుమతులు ఇస్తున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో 2019లోపు లక్ష ఐటీ ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. ఇందుకు కోటి చదరపు అడుగుల కార్యాలయ స్థలం అవసరమని స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఐటీ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు అనేక చర్యలు తీసుకున్నారని లోకేశ్ తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని ఆకర్షణీయమైన పాలసీలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. ఐటీ సంస్థలకు కార్యాలయ స్థలంం సమస్యను అధిగమించడానికి ముఖ్యమంత్రి మార్గనిర్దేశంతో డెజిగ్నేటెడ్ టెక్నాలజీ పార్క్ పాలసీని రూపొందించామని, ఐటీ కంపెనీలు కార్యాకలాపాలు ప్రారంభించేందుకు అవసరమైన స్థలాన్ని రాయితీతో అందిస్తున్నట్లు చెప్పారు.