ఈ నెల 18 - 20 తేదీల మధ్య తుపాను వస్తోందని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. మన సంకల్పం మంచిదైతే, ఫలితాలు కూడా మంచిగానే ఉంటాయని సమర్థ నీటి నిర్వహణ, నీరు-ప్రగతి, జలసంరక్షణ కార్యక్రమాలే దీనికి నిదర్శనమని ఆయన తెలిపారు. కొంచెం ఆలస్యంగానైనా రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు పడ్డాయని జలకళతో రైతులంతా సంతోషంగా ఉన్నారని చెప్పారు. భూగర్భ జలమట్టం కూడా 5.5 మీటర్లు పెరిగిందని అన్నారు. చెక్ డ్యాముల నిర్మాణం, పంట కుంటల తవ్వకాలను వేగవంతం చేయాలని ఆదేశించారు. నీరు-ప్రగతి, వ్యవసాయంపై నేడు చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ మేరకు అధికారులకు సూచనలు చేశారు.