కార్పొరేట్ కాలేజీల్లో విద్యార్థులపై ఒత్తిడిని తగ్గించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఏపీ మంత్రి గంటా శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. ఈ ఉదయం కార్పొరేట్ కాలేజీ యాజమాన్యాలతో సమావేశమైన ఆయన, ప్రతి కాలేజీలో స్టూడెంట్ పోలీసింగ్ పేరిట కొత్త విధానాన్ని అవలంభించాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఇందులో భాగంగా విద్యార్థులే చదువుతో ఒత్తిడికి గురవుతున్న విద్యార్థులను గుర్తిస్తారని, వారి గురించిన సమాచారాన్ని లెక్కరర్లకు అందిస్తారని అన్నారు. ప్రతి కళాశాలలో విద్యార్థులతో కూడిన పోలీసింగ్ కమిటీని ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. ఏ కాలేజీలో కూడా చదువుకోవాలని విద్యార్థులపై ఒత్తిడి తేరాదని సూచించారు. ఇటీవలి కాలంలో విద్యార్థుల ఆత్మహత్యల ఘటనలు పెరుగుతూ ఉండటంపై ఆందోళన వ్యక్తం చేసిన గంటా, మరోసారి ఇటువంటివి జరుగకుండా చూసుకోవాలని కళాశాలల యాజమాన్యాలకు సూచించారు.