గూడూరు మండల పరిధిలోని కె. నాగలాపురంలో గ్రామ దేవత సుంకులా పరమేశ్వరీదేవి ఆలయంలో వివిధ హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకల లెక్కింపు రెండవ రోజు గురువారం కొనసాగింది. కానుకల లెక్కింపును ఆలయ కార్యనిర్వహణాధికారి దినేష్ పర్యవేక్షించారు.
ఆలయంలోని ఆరు హుండీలలో బుధవారం మూడింటిలోని కానుకలను లెక్కించగా గురువారం ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు మరో మూడు హుండీల్లోని కానుకలను లెక్కించారు. మొత్తం 55 మంది సిబ్బంది హుండీ కానుకల లెక్కింపులో పాల్గొన్నారు.
గురువారం లెక్కింపులో రూ. 26, 21, 315 నగదుతో పాటు 18 గ్రాముల బంగారం, 2, 250 గ్రాముల వెండి లభించినట్లు అధికారులు తెలిపారు. బుధవారం లెక్కించిన ఆదాయం రూ. 21, 38, 260తో కలిపి అమ్మవారికి ద్వారా మొత్తం రూ. 47, 59, 575 ఆదాయం వచ్చినట్లు ఈవో దినేష్ తెలిపారు.
పర్యవేక్షణాధికారి శ్రీనివాసరెడ్డి, ఆలయ సిబ్బంది శ్రీనివాసులు, కేశవ్, కమిటీ సభ్యులు తులసమ్మ, లింగమ్మ, లక్ష్మన్న, మహేశ్వరి, మాదన్న, సూర్యమద్దిలేటి, రంగస్వామి, శీను, తదితరులు పాల్గొన్నారు.