జమ్ముకశ్మీర్లోని పుల్వామా జిల్లాలో శనివారం జరిగిన ఎదురుకాల్పుల్లో లష్కరే తొయిబా(ఎల్ఈటీ)కి చెందిన కీలక ఉగ్రవాది వసీమ్ షాతోపాటు మరో ఉగ్రవాది హషీజ్ నిసార్ను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. పుల్వామాలోని ఓ గ్రామంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నట్లు సమాచారం రావడంతో భద్రతా బలగాలు విస్తృతంగా తనిఖీలు చేపట్టాయి. గమనించిన ఉగ్రవాదులు భద్రతా బలగాలపైకి కాల్పులు జరిపారు. ఈ నేపథ్యంలోనే ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఎల్ఈటీ ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ విషయాన్ని రక్షణశాఖ ప్రతినిధి కల్నల్ రాజేశ్ కలియా ధ్రువీకరించారు.
ఎదురుకాల్పులు జరిపిన ప్రదేశం నుంచి ఒక ఏకే-47, ఏకే-56, ఆరు ఏకే మ్యాగజైన్లను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఎన్కౌంటర్ ముగిసినట్లు అధికారులు తెలిపారు. దక్షిణ కశ్మీర్లోని రాజకీయ నేతలు, భద్రతా బలగాలపై జరిగిన పలు దాడుల్లో వసీమ్ కీలక పాత్ర పోషించినట్లు జమ్ముకశ్మీర్ డీజీపీ వెల్లడించారు. అతడిపై రూ.10లక్షల రివార్డు కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.