ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హిమాచల్‌ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తేదీ ప్రకటన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 13, 2017, 08:22 AM

హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. నవంబర్ 9న ఆ రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం గురువారం స్పష్టం చేసింది. డిసెంబర్ 18న ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉంటుందని ఈసీ వెల్లడించింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న హిమాచల్ ఎన్నికల తేదీని ప్రకటించిన ఎలక్షన్ కమిషన్ బీజేపీ అధికారంలో ఉన్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించలేదు. కానీ డిసెంబర్ 18లోగా ఆ రాష్ట్రంలోనూ ఎన్నికలను నిర్వహిస్తామని తెలిపింది.


గుజరాత్, హిమాచల్ రాష్ట్రాల ఎన్నికల ఫలితాల కౌంటింగ్ ఒకేసారి జరిగే అవకాశం ఉందని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అచల్ కుమార్ జ్యోతి తెలిపారు. 68 మంది ఎమ్మెల్యేలు ఉన్న హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ గడువు జనవరి 7తో ముగియనుంది. 182 మంది శాసన సభ్యులున్న గుజరాత్ అసెంబ్లీ గడువు జనవరి 22తో ముగియనుంది.


లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ రెండు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. వీటి ఫలితాల ప్రభావం సాధారణ ఎన్నికలపై పడే అవకాశం ఉంది. దీంతో పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోనున్నాయి. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్‌లో వీరభద్రసింగ్ నాయకత్వంలోని ప్రభుత్వం అధికారంలో ఉంది. ఆయన ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. గుజరాత్‌లో అధికారంలో ఉన్న బీజేపీ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించగా.. బీజేపీ నాలుగు రాష్ట్రాల్లో గెలుపొందింది. ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌లలో గెలిచిన బీజేపీ.. గోవా, మణిపూర్‌లలోనూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com