వైసీపీ అధినేత జగన్ పాదయాత్రకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. 2వ తేదీ నుంచి ఆరు నెలలపాటు ఆయన పాదయాత్ర కొనసాగనుంది. ఈ నేపథ్యంలో జగన్ పాదయాత్రపై అరకు ఎంపీ కొత్తపల్లి గీత విమర్శలు గుప్పించారు. పాదయాత్ర చేసినంత మాత్రాన ముఖ్యమంత్రి అయిపోతారనుకుంటే... అంతకన్నా మూర్ఖత్వం మరొకటి ఉండదని అన్నారు. జగన్ పాదయాత్ర ముమ్మాటికీ పొలిటికల్ స్టంటేనని తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా రాదనే విషయం అప్పటి, ఇప్పటి నేతలందరికీ తెలుసని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా అనేది ముగిసిపోయిన అధ్యాయమని తెలిపారు. ఏపీ ప్రజలను మభ్యపెట్టేందుకే ప్రత్యేక హోదా వాగ్దానం చేశారని అన్నారు. ప్రత్యేక హోదా కోసం వైసీపీ ఎంపీలు రాజీనామా చేస్తారంటూ మూడేళ్లుగా చెబుతున్నారని... వాళ్లు ఎప్పుడు రాజీనామా చేస్తారో చెప్పాలని ఎద్దేవా డిమాండ్ చేశారు.