మద్యం ప్రియులకు షాకిచ్చేలా తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లిక్కర్ ధరలను పెంచాలని ముఖ్యమంత్రి పళనిస్వామి అధ్యక్షతన జరిగిన కేబినెట్ మీటింగ్ లో నిర్ణయించారు. బీరు, బ్రాందీ, విస్కీలపై 10 రూపాయల నుంచి 12 రూపాయల వరకు ధరలను పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. మద్యం ధరలను పెంచడం వల్ల రాష్ట్ర ఖజానాకు ప్రతి ఏటా రూ. 5వేల కోట్ల ఆదాయం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. మరోవైపు, మద్యం ధరలను పెంచడాన్ని డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ తప్పుబట్టారు. దశలవారీగా మద్య నిషేధాన్ని అమలు చేస్తామని చెప్పిన అన్నాడీఎంకే ప్రభుత్వం ఆదాయం కోసం ధరలను పెంచాలనుకోవడం విడ్డూరంగా ఉందని అన్నారు. ఈ నిర్ణయంతో మద్య నిషేధాన్ని అమలు చేయాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదనే విషయం అర్థమవుతోందని చెప్పారు.