రాయలసీమను వర్షాలు ముంచెత్తాయి. ముఖ్యంగా అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లో భారీవానలు కురిశాయి. ఫలితంగా పలు చోట్ల వాగులు, వంకలు పొంగిపొర్లాయి. చాలా చెరువులు కళకళలాడుతున్నాయి. కొన్ని చెరువులకు గండ్లు పడగా.. అనేక చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొన్ని చోట్ల పంటలకు నష్టం వాటిల్లింది. ఎక్కువ చోట్ల రైతులకు ఈ వానలు ఊపిరినిచ్చాయు. అధికారులు అప్రమత్తమై సహాయ చర్యలు చేపట్టారు. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.కర్నూలు జిల్లాలో పదేళ్ల తర్వాత బనగానపల్లె న డిబొడ్డున్న ఉన్న జుర్రేరు వాగు పొర్లి ప్రవహించింది.
దద్దనాల ప్రాజెక్టుకు 14 అడుగుల మేర నీరు చేరింది. కొలిమిగుండ్ల మండలం కల్వటాల సమీపంలోని బ్రిడ్జి వద్ద వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. కోవెలకుంట్ల మండలంలో కుందూనది ఉప్పొంగి భీమునిపాడు కాలనీల్లోకి నీరు చేరింది. ఎర్రమల కొండలు, ఎస్సార్బీసీ నుంచి వస్తున్న నీటితో అవుకు రిజర్వాయర్ జలకళ సంతరించుకుంది. జిల్లాలోని జలపాతాలు కనువిందు చేస్తున్నాయి. హాలహర్వి మండలం క్షత్రగుడి-మోకా రోడ్డులో రెండు లారీలు ఇరుక్కుపోవడంతో అర్ధరాత్రి నుంచి ఉదయం 8 వరకు వాహనాల రాకపోలకు పూర్తిగా స్తంభించాయి