అనంతపురం: అనంతపురం నగరంలో వర్షం కారణంగా నష్టపోయిన వారిని అన్ని విధాలా ఆదుకుంటామని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత హామీ ఇచ్చారు. గత రాత్రి కురిసిన వర్షానికి నగరం జలమయమైన విషయం తెలుసుకున్న మంత్రి అనేక ప్రాంతాల్లో పర్యటించారు. నడిమి వంక వద్ద నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. అధికారుల తీసుకున్న చర్యలపై ఆరా తీశారు. ఇళ్లలో నీరు వచ్చిన వారికి ఉదయం, మధ్యాహ్నం భోజనం అందేలా చూడాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎన్నో సంవత్సరాల తర్వాత అనంతలో ఇలాంటి వర్షం కురవడంతో ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. ముంపునకు గురైన కాలనీల్లో సహాయ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అనంతపురం నగరంలోని నడిమివంక, ఉమానగర్, శ్రీకంఠం సర్కిల్ వద్ద ఉన్న పెద్ద వంకలు నదీ ప్రవాహాలను తలపించాయి. మేయర్ స్వరూప శ్రీకంఠం సర్కిల్ వద్ద ఉన్న వంకను పరిశీలించి, స్థానికుల సమస్యలు తెలుసుకున్నారు. బియ్యం సహా ఇంట్లో వస్తువులన్నీ నీట మునిగాయని కాలనీవాసులు మేయర్ దృష్టికి తీసుకురాగా ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దని తక్షణ సాయంగా అధికారులు బియ్యం ఇతర వస్తువులు అందజేస్తారని మేయర్ స్వరూప తెలిపారు.