విజయనగరం: విజయనగరం జిల్లాలో చేపట్టిన ఆరు జిల్లాల సైనిక నియామక ప్రక్రియకు వర్షం అడ్డంకిగా మారింది. గురువారం అర్ధరాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా జల్లులు కురుస్తుండడంతో పరుగుపందెం కోసం ఏర్పాటు చేసిన 400 మీటర్ల ట్రాక్ ముద్దయ్యింది. ట్రాక్పై వర్షపు నీరు చేరి బురదమయంగా మారడంతో అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఉదయం 5 గంటల నుంచి నిర్వహించిన పరుగుపందెంలో 2 వేల మంది అభ్యర్థులు పాల్గొనగా.. 20 మంది కూడా ఎంపిక కాలేదు. అడుగులోతు వరకు కాళ్లు బురదలో దిగబడిపోతుండడంతో పలువురు మధ్యలోనే నిష్క్రమించారు. పలువురు అభ్యర్థులు రెండో రౌండ్లో సొమ్మసిల్లిపోయారు. మరికొందరు గాయపడ్డారు.
ఈ నేపథ్యంలో అధికారులు ఆర్మీ ర్యాలీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. తిరిగి రెండు నెలల తర్వాత నిర్వహిస్తామని, తేదీలను త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. ఆర్మీ ర్యాలీ రద్దు చేయడంతో ఆరు జిల్లాల నుంచి వచ్చిన అభ్యర్థులు నిరాశతో వెనుదిరిగారు.