ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేటి నుంచి భారత్, శ్రీలంక సిరీస్ ప్రారంభం.. నేడే తొలి టీ20

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 24, 2022, 09:41 AM

నేటి నుంచి భారత్, శ్రీలంక జట్ల మధ్య 3 మ్యాచ్ ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ లో ఇరు జట్లు కీలక ఆటగాళ్లు లేకుండానే బరిలోకి దిగుతున్నాయి. టీమిండియాలో కేఎల్‌ రాహుల్‌, సూర్యకుమార్‌, దీపక్‌ చాహర్‌ గాయాల కారణంగా సిరీస్ కు దూరమయ్యారు. విరాట్‌ కోహ్లి, రిషబ్‌ పంత్‌ లాంటి కీలక ఆటగాళ్లకు రెస్ట్ ఇచ్చారు. రెగ్యులర్‌ ఆటగాళ్లు జట్టుకు దూరం కావడంతో ఎక్కువగా ఆడే ఛాన్స్‌ రాని ఆటగాళ్లను తుది జట్టులో చూడొచ్చు. శ్రేయస్‌ అయ్యర్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, వెంకటేశ్‌ అయ్యర్‌లకు మరిన్ని అవకాశాలు లభించడం ఖాయం. సంజు శాంసన్‌ కు ఈ సిరీస్ కీలకం కానుంది. ఇషాన్‌ కిషన్‌ తో అతడికి పోటీ ఉంది. ఇక పేసర్ బుమ్రా మళ్లీ ఈ సిరీస్‌లో బరిలోకి దిగుతున్నాడు.


భారత్‌తో పోలిస్తే శ్రీలంక బలహీనంగా కనిపిస్తోంది. ఆ జట్టుకు ప్రధాన బలమైన స్పిన్నర్ హసరంగ కరోనా కారణంగా సిరీస్‌కు దూరం కావడం లంకకు పెద్ద ఎదురుదెబ్బే. తీక్షణ రూపంలో మరో నాణ్యమైన స్పిన్నర్ ఆ జట్టులో ఉన్నాడు. పేసర్లలో చమీర, లహిరు కుమార నిలకడగానే రాణిస్తున్నారు. బ్యాటింగ్‌లో నిశాంక, కుశాల్‌ మెండిస్‌పై భారత బౌలర్లు దృష్టిసారించాలి. ఆస్ట్రేలియాపై వీళ్లిద్దరూ సత్తా చాటారు. చండిమాల్‌, అసలంక, గుణతిలక ఫామ్‌లో లేకపోవడంతో లంక ఇబ్బంది పడుతోంది. కెప్టెన్‌ శనక నుంచి ఆ జట్టు ఆల్‌రౌండ్‌ ప్రదర్శన ఆశిస్తోంది.


లఖ్‌నవూలోని అటల్‌ బిహారి ఏక్‌నా స్టేడియంలో తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలం. ఇక్కడ నాలుగు టీ20 మ్యాచ్‌లు జరగ్గా అన్నింట్లోనూ మొదట బ్యాటింగ్‌ చేసిన జట్టే గెలిచింది.


తుది జట్లు (అంచనా)


భారత్‌: రోహిత్‌, రుతురాజ్‌, కిషన్‌/శాంసన్‌, శ్రేయస్‌, దీపక్‌ హుడా, వెంకటేశ్‌ అయ్యర్‌, జడేజా/బిష్ణోయ్‌, చాహల్‌, భువనేశ్వర్‌, బుమ్రా, హర్షల్‌ పటేల్‌/సిరాజ్‌.


శ్రీలంక: కుశాల్‌ మెండిస్‌, నిశాంక, గుణతిలక, అసలంక, చండిమాల్‌, శనక, కరుణరత్నె, తీక్షణ, వాండర్సే, చమీర, లహిరు కుమార.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa