ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దేశాభివృద్ధిలో ఉపగ్రహాలది కీలక పాత్ర: వెంకయ్య

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 04, 2017, 04:36 PM

ఉప-రాష్ట్రపతిగా ఎన్నికైన తర్వాత నెల్లూరు జిల్లాలో వెంకయ్యనాయుడు తొలిసారిగా పర్యటిస్తున్నారు. బుధవారం శ్రీహరికోటలోని అంతరిక్ష కేంద్రంలో పర్యటించిన ఆయన ఎంఆర్‌ కురూప్‌ ఆడిటోరియంలో ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ... అంతరిక్ష సేవలు సామాన్యుడికి అందుబాటులోకి వచ్చాయని పేర్కొన్నారు. ఉపగ్రహాల ద్వారా దేశం ఎంతో అభివృద్ధి సాధించిందని అన్నారు. ప్రపంచ దేశాలతో పోలిస్తే అంతరిక్ష ప్రయోగాల్లో మనమే ముందున్నామని... శ్రీహరికోట నుంచి విదేశాలకు చెందిన ఎన్నో ఉపగ్రహాలను నింగిలోకి పంపిన ఘనత మనసొంతమని కొనియాడారు. విశాఖలో వచ్చిన హుద్‌హుద్‌ తుపాను, సునామీ తదితర విపత్కర సమయాల్లో ఉపగ్రహాలు అందించిన సమాచారంతో ముందస్తు చర్యలు చేపట్టి నష్టాన్ని నివారించామన్నారు.


దేశంలోని యువత వారసత్వ సంపదపై ఆధారపడకుండా స్వశక్తితో ఎదగాలని కోరారు. తాను వీధిబడిలో చదివి ఉపరాష్ట్రపతి వరకు ఎదిగానని అన్నారు. ప్రస్తుతం కార్పొరేట్‌ మోజులో పడి మాతృభాషను మరచిపోతున్నారని వెంకయ్యనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. అంతరిక్ష పరిశోధన పితామహుడు డాక్టర్‌ విక్రమ్‌ సారాభాయ్‌... ఆయన తర్వాత సతీష్‌ ధావన్‌ తదితరుల కాలంలో భారత్‌ ఎన్నో అంతరిక్ష పరిశోధనలు చేసిందని వివరించారు. శ్రీహరికోట నుంచి ఇస్రో అతి తక్కువ ఖర్చుతో మామ్‌ను నింగిలోకి పంపి విజయవంతం చేసిందన్నారు. చంద్రయాన్‌-1 ప్రయోగం ద్వారా చందమామపై నీళ్లు ఉన్నాయని గుర్తించామన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com