ఆస్కార్ అవార్డుకు భారతదేశం నుంచి 'బాహుబలి-2' నామినేట్ కాకపోవడంపై తనకు ఎలాంటి బాధ లేదని దర్శక దిగ్గజం రాజమౌళి అన్నారు. ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి ఈ మేరకు స్పందించారు. ఈ సినిమాను తీసే సమయంలో తాను అవార్డుల గురించి ఆలోచించలేదని చెప్పారు. అవార్డులు తన లక్ష్యం కాదని... సినిమాను గొప్పగా తెరకెక్కించడం, ప్రాజెక్టుపై నమ్మకంతో జీవితాలను సైతం పెట్టుబడిగా పెట్టిన వారికి కోసం భారీ వసూళ్లు వచ్చేలా సినిమాను ప్రజల్లోకి తీసుకుపోవడమే తన లక్ష్యమని తెలిపారు. అవార్డులు వస్తే సంతోషమే... రాకపోయినా తనకు ఎలాంటి ఇబ్బంది లేదని అన్నారు. 2018 ఆస్కార్ నామినేషన్ల కోసం మన దేశం నుంచి 26 చిత్రాలు పోటీపడ్డాయి. ఇందులో తెలుగు చిత్రాలు 'బాహుబలి-2', 'గౌతమీపుత్ర శాతకర్ణి'లు కూడా ఉన్నాయి. ఈ చిత్రాలను చూసిన ఆస్కార్ ఇండియా జ్యూరీ చివరకు బాలీవుడ్ కు చెందిన 'న్యూటన్'ను ఎంపిక చేసింది.