సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు అంటూ ప్రొ.ఐలయ్య రాసిన పుస్తకం వివాదం రేపుతోన్న విషయం తెలిసిందే. ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. ఈ రోజు ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ‘ఇది సరైంది కాదు మంచిది కాదు.. ఎవరు కూడా ఇటువంటివి ప్రోత్సహించకూడదు.. ఒక కులాన్ని కించపర్చే విధంగా పుస్తకాలు రాసినా, వ్యాఖ్యలు చేసినా మంచిదికాదు అందరూ సంయమనం పాటించాలి. సమాజంలో విద్వేషాలు కలిగేలా చేయకూడదు’ అని వ్యాఖ్యానించారు. ఐలయ్యపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా? అన్న ప్రశ్నపై చంద్రబాబు స్పందిస్తూ... ‘అటువంటి పుస్తకాలు పబ్లికేషన్ కాకుండా, ఒక వేళ పబ్లికేషన్ అయినప్పటకీ మార్కెట్లోకి వెళ్లకుండా కట్టడి చేయాల్సి ఉంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం చర్చిస్తోంది’ అని వ్యాఖ్యానించారు.