శ్రీవారి సాలకట్ల బ్రహ్మూత్సవాల్లో నాలుగో రోజైన మంగళవారం ఉదయం కల్పవృక్ష వాహనసేవలో కళాబృందాలు తమ ప్రదర్శనలతో స్వామివారికి కళానీరాజనం సమర్పించాయి. టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కళాబృందాల ప్రదర్శనలు భక్తులను విశేషంగా అలరించాయి. రాజమండ్రికి చెందిన మారుతి నాసిక్ డోలు బృందం ప్రదర్శించిన అఘోరా నృత్యం భక్తులను అలరించింది. శివరామకృష్ణ ఆధ్వర్యంలో 50 మంది కళాకారులు ఈ ప్రదర్శన ఇచ్చారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, వినాయకుడు, ఇతర దేవతారూపాలు ధరించిన కళాకారులు మధ్యలో నిలిచి ఉండగా, అఘోరా వేషధారణలోని కళాకారులు శూలాలతో నృత్యం చేశారు. ముగ్గురు కళకారులు డోలు వాయిస్తుండగా అందుకు అనుగుణంగా అఘోరాలు అడుగులు వేసి ముందుకు కదిలారు.