ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) లిక్కర్ కింగ్ విజయ్మాల్యాపై రెండో చార్జిషీటు ధాఖలు చేయడానికి ముమ్మర ప్రయత్నాలు మొదలుపెట్టింది. మూడు నెలల క్రితం మొదటి చార్జీషీటును దాఖలు చేసిన విషయం తెలిసిందే. మొదటి చార్జీషీటు ఈ ఏడాది జూన్లో ప్రీవెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ చట్టం కింద చార్జీషీటు దాఖలు చేసింది. మాల్యా కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ కోసం ఐడిబీఐ బ్యాంకు నుంచి రూ.900 కోట్ల రుణం తీసుకొని వాటిని విదేశాలకు తరలించాడని ప్రధానమైన ఆరోపణ. తదుపరి చార్జీషీటులో మాల్యా బ్యాంకుల నుంచి వేలాదికోట్ల రూపాయలు రుణాలు తీసుకొని విదేశాల్లోని డొల్లకంపెనీలకు తరలించారని చార్జీషీటులో పేర్కొంటుందని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఈడీ అధికారి తెలియజేశారు.
మాల్యా స్టేట్బ్యాంకు నేతృత్వంలో ఏర్పడిన బ్యాంకుల కన్సార్షియం నుంచి రూ.6,000 కోట్లు రుణాలు తీసుకొని విదేశాల్లో అరడజను డొల్ల కంపెనీలకు తరలించారని సోమవారం నాడు మీడియాలో పెద్దెత్తున వార్తలు వెలువడ్డాయి. దీంతో సీబీఐతో పాటు ఈడీ దీనిపై లోతుగా దర్యాప్తు చేసి చార్జీషీటు దాఖలు చేస్తుంది. ఇప్పటికే మాల్యాపై ఒక చార్జీషీటు దాఖలైంది. త్వరలోనే మరో చార్జీషీటు దాఖలవుతుందని పేరు చెప్పడానికి ఇష్టపడని ఈడీ అధికారి చెప్పారు. మరో అధికారి మాల్యా కింగ్ఫిషర్పేరుతో రుణాలు తీసుకొని సుమారు 30డొల్ల కంపెనీలకు తరలించినట్లు గుర్తించామని తెలిపారు. కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ క్రెడిట్ రేటింగ్ అతి తక్కువగా ఉన్నా బ్యాంకులు కొత్త కొత్త రుణాలు మంజూరు చేశాయని, రెండో చార్జీషీటు స్టేట్బ్యాంకు ఆఫ్ ఇండియా కన్సార్షియం ఫిర్యాదును ఆధారంగా ఫైల్ చేయనున్నట్లు ఈడీ అధికారి ఒకరు తెలియజేశారు.
అయితే సీబీఐ మాత్రం కొత్త చార్జీషీటు దాఖలు చేయడం లేదని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా జనవరి 31వ తేదీన ముంబైలోని సీబీఐ కోర్టు ఆయనపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన తర్వాత సీబీఐ ఈ ఏడాది జనవరి 24 చార్జీషీటు దాఖలు చేసింది. కాగా విజయ్మాల్యాపై బ్యాంకులు తమ రూ.9,000 కోట్ల బకాయిలు వసూలు చేయడానికి పెద్దెత్తున ఒత్తిడి తేవడంతో ఆయన గత ఏడాది మార్చిలో దేశం నుంచి లండన్ పారి పోయారు. ప్రస్తుతం లండన్ కోర్టు లో ఆయనపై కేసు నడుస్తోంది.