చెన్నై: బీజేపీ కురువృద్ధుడు, మాజీ ఉపప్రధాని ఎల్కే ఆడ్వాణీ నేడు చెన్నైకి వెళ్లనున్నారు. స్థానిక తాంబరంలోని జైగోపాల్ గరోడియా నేషనల్ హయ్యర్సెకండరీ స్కూలు వార్షికోత్సవంలో పాల్గొనేందుకు ఆయన ఢిల్లీ నుంచి రానున్నారు. మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభం కానున్న ఈ వేడుకలకు ఆడ్వాణీ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధికారభాషాభివృద్ధిశాఖ మంత్రి మాఫోయ్ పాండ్యరాజన్, రాజ్యసభ సభ్యులు డాక్టర్ వి.మైత్రేయన్, ఇల గణేశన్, లోక్సభ సభ్యుడు కేఎన్ రామచంద్రన్, ఎమ్మెల్యే ఎస్ఆర్ రాజా తదితరులు కూడా హాజరు కానున్నట్టు నిర్వాహకులు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఇదిలా వుండగా ఈ కార్యక్రమం ముగిసిన వెంటనే మళ్లీ ఆడ్వాణీ ఢిల్లీ పయనమై వెళ్తారని నిర్వాహకులు తెలిపారు.