భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, ఒలింపిక్ పతక విజేత, తెలుగు తేజం పూసర్ల వెంకట సింధు పేరును దేశ మూడో అత్యున్నత పురస్కారానికి సిఫార్సు చేశారు. ఆమె పేరును పద్మభూషణ్ అవార్డుకు సిఫార్సు చేసినట్లు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్లో సింధు 2వ స్థానంలో కొనసాగుతోంది. తాజాగా సింధు కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ గెలుచుకున్న సంగతి తెలిసిందే.
2016 రియో ఒలింపిక్స్లో రజతం సాధించిన సింధు ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లోనూ తన సత్తా చాటి రజత పతకాన్ని దక్కించుకుంది. ఇటీవల బ్యాడ్మింటన్లో ఆమె సాధిస్తోన్న వరుస విజయాలను గుర్తించిన కేంద్ర క్రీడా మంత్రిత్వశాఖ సింధు పేరును పద్మభూషణ్కు ప్రతిపాదించింది. సింధు 2013లో అర్జున అవార్డు, 2015లో పద్మశ్రీ, 2016లో రాజీవ్ ఖేల్రత్న అవార్డులను అందుకున్న సంగతి తెలిసిందే.
ఇటీవల భారత క్రికెట్ జట్టు మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ పేరును బీసీసీఐ ఏకగ్రీవంగా పద్మభూషణ్ అవార్డుకు ప్రతిపాదించిన సంగతి తెలిసిందే.