భారత్, ఆస్ట్రేలియా మధ్య చెన్నైలో తొలి వన్డే ముగిసిన మరుసటి రోజు ధోనీ ఇండియా సిమెంట్స్ ఆఫీసుకెళ్లాడు. ఈ విషయాన్ని ఇండియా సిమెంట్స్ లిమిటెడ్ ధృవీకరించింది. ఆ సంస్థలో వైస్ ప్రెసిడెంట్ హోదాలో పని చేస్తున్న ధోనీ.. చెన్నైలోని కార్పొరేట్ ఆఫీస్కు వెళ్లడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. శ్రీనివాసన్తో భేటీ అయిన మహీ దాదాపు సగం రోజు అక్కడే గడిపాడు. ప్రముఖ ఐపీఎల్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ కూడా ఈ సంస్థకు చెందిందనే సంగతి తెలిసిందే.
ఇండియా సిమెంట్స్ ఆఫీస్ సిబ్బందితో కాసేపు మాట్లాడిన ధోనీ... కొలీగ్స్తో కలిసి సరదాగా సెల్ఫీలు దిగాడు. జిమ్కి వెళ్లడంతోపాటు లంచ్ సమయంలో కేఫ్టేరియాకెళ్లి ఆ ప్రాంతమంతా కలియతిరిగాడు. కాసేపు శ్రీనివాసన్తో కలిసి సీనియర్ మేనేజర్లతో ముచ్చటించాడు.ఫిక్సింగ్ ఆరోపణల కారణంగా రాజస్థాన్ రాయల్స్తోపాటు.. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై సుప్రీం కోర్టు రెండేళ్ల నిషేధం విధించింది. ఈ ఏడాదితో ఆ నిషేధం ముగిసింది. దీంతో చెన్నై జట్టు వచ్చే ఏడాది మళ్లీ ఐపీఎల్లో అడుగుపెట్టనుంది. ధోనీ మళ్లీ ఆ జట్టు కెప్టెన్గా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. ధోనీ ఇండియా సిమెంట్స్ ఆఫీసుకెళ్లిన విషయమై బీసీసీఐ ఎలా స్పందిస్తుందనేది ఆసక్తిగా మారింది. ధోనీని వైస్ ప్రెసిడెంట్ నియమిస్తూ.. ఇండియా సిమెంట్స్ ఇచ్చిన అపాయింట్మెంట్ లెటర్, వేతన ప్యాకేజీ వివరాలు లలిత్ మోడీ గతంలో లీక్ చేశారు.