విజయవాడ: కృష్ణా జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఇటీవల విద్యార్థుల మధ్య జరిగిన దాడుల వ్యవహారంలో మంత్రి గంటా శ్రీనివాసరావు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆరుగురు విద్యార్థులను శాశ్వతంగా విద్యాసంస్థ నుంచి బయటకు పంపిస్తూ టీసీలు ఇచ్చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇటీవల నూజివీడు ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు, అధ్యాపకులతో ఆయన భేటీ అయ్యారు. అనంతరం క్రమశిక్షణ తప్పిన విద్యార్థుల విషయంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
శుక్రవారం ఉదయం ట్రిపుల్ ఐటీ ఉపకులపతితో సుదీర్ఘ చర్చ అనంతరం విద్యార్థులపై చర్యలకు మంత్రి ఆదేశించారు. జూనియర్లపై దాడికి పాల్పడిన సీనియర్ విద్యార్థులను ఐదు స్థాయిల్లో విభజించి విచారణ కమిటీ శిక్ష ఖరారు చేసింది. నేర తీవ్రత దృష్ట్యా విద్యార్థులపై చర్యలు తీసుకోవాల్సి వచ్చినట్లు పేర్కొంది. ఈ వ్యవహారంలో బాధ్యులుగా గుర్తించిన మొదటి ఆరుగురు విద్యార్థులకు టీసీలు ఇచ్చేయాలని నిర్ణయం తీసుకున్నారు. మరో తొమ్మిది మందిని ఏడాది పాటు సస్పెండ్ చేశారు. అయితే, వీరికి పరీక్షలకు అనుమతించారు. మూడో కేటగిరీ కింద 13 మందిని, నాలుగో కేటగిరీ కింద 24 మందిని, ఐదో కేటగిరీ కింద ఇద్దరు విద్యార్థులను చేర్చారు. వీరిని రెండు నెలల సస్పెండ్ చేసి.. పరీక్షలకు అనుమతించాలని నిర్ణయించారు.
ఘర్షణలో కీలకులుగా భావించిన ఆరుగురికి టీసీలు ఇవ్వాలనే అసాధారణ నిర్ణయం తొలిసారి తీసుకున్నట్లు మంత్రి గంటా తెలిపారు. ఇది విచారకరమైనప్పటికీ.. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదనే ఈ చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.