రాష్ట్రంలో విద్య, వైద్య ఆరోగ్య రంగాలకు నిధులు కేటాయిస్తున్నా ఆశించిన ఫలితాలు సాధించకపోవడంపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. అహాలు వీడి సమన్వయంతో పనిచేయకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. నాయకత్వం సరిగ్గా ఉంటే ఈ తరహా ఇబ్బందులు ఉండవంటూ ఆయా శాఖల మంత్రులను పరోక్షంగా మందలించారు. విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్లో కలెక్టర్ల సదస్సు రెండోరోజు కొనసాగింది. వైద్య, ఆరోగ్యం, సంక్షేమం, విద్య, పట్టణాభివృద్ధి, పురపాలక, వృత్తి నైపుణ్యం తదితర శాఖలపై సీఎం అధ్యక్షతన కీలక చర్చ జరిగింది. విద్యాశాఖ అధికారుల పనితీరుపైనా ముఖ్యమంత్రి కలెక్టర్ల సదస్సు లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బయో మెట్రిక్ విధానం అమలులో తాత్సారంపై ఆయన మండిపడ్డారు. మంత్రి గంటా వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినా వ్యవస్థ సరిగా పనిచేయటం లేదని, ఎన్ని సార్లు చెప్పినా ఆ శాఖ తలకెక్కించుకోకపోవటం సరికాదని సీఎం ఆక్షేపించినట్టు సమాచారం. లంచాలు తీసుకొనే అధికారులపై చర్యలు తీసుకోవడంలో నిర్మొహమాటంగా వ్యవహరించాలన్నారు. అప్పుడే ప్రజలకు న్యాయం జరుగుతందని అన్నారు. కలెక్టర్లు తమ ఈగోలు, అహంకారాన్ని పక్కనబెట్టి ప్రజా సంక్షేమం కోసం పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.