మహారాష్ట్రలో కాంగ్రెస్కు ఎదురుదెబ్బ తగిలింది. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారాయణ రాణె, ఆయన కుమారుడు, మాజీ ఎంపీ నీలేశ్ ఆ పార్టీ సభ్యత్వానికి గురువారం రాజీనామా చేసినట్టు ప్రకటించారు. తన రాజీనామా లేఖను ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీకి పంపినట్టు తెలిపారు. గతంలో సీఎంగా పనిచేసిన తనకు కాంగ్రెస్ పార్టీలో తనకు సరైన గౌరవం దక్కకపోవడం వల్లే తాను రాజీనామా చేస్తున్నట్టు మీడియాకు వెల్లడించారు. తన ఎమ్మెల్సీ పదవికి సైతం రాజీనామా చేసినట్టు చెప్పారు. ఆయన తన ఇద్దరు కుమారులతో కలిసి భాజపాలో చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.నారాయణ్ రాణె గతంలో శివసేన పార్టీ నుంచి ముఖ్యమంత్రిగా పనిచేశారు. పలు శాఖలకు మంత్రిగానూ సేవలందించారు. 2005లో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరి ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు.