విజయవాడ: రచయిత, ఆచార్య కంచ ఐలయ్య తన రచనలతో కులాలను కించపరచడం సరికాదని ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి అన్నారు. వైశ్యుల్లో జాతిపిత మహాత్మాగాంధీ నుంచి పొట్టి శ్రీరాములు వరకు చాలామంది గొప్పవారున్నారని గుర్తుచేశారు. కులాలను వివాదాస్పదం చేయాలని బాబాసాహెబ్ అంబేడ్కర్ ఎక్కడా చెప్పలేదన్నారు. రచయితలకు చెడ్డపేరు తెచ్చేలా ఐలయ్య వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మొత్తం వైశ్యులందరినీ ఒక్కగాటన కట్టి మాట్లాడటం సరికాదన్నారు. సదాపర్తి భూముల విషయంలో ప్రతిపక్షం అనవసర రాద్ధాంతం చేస్తోందని మంత్రి మండిపడ్డారు. బహిరంగ వేలానికి పెట్టిన తర్వాత ఆ భూములపై విమర్శలు చేయడం సరికాదన్నారు. రూ. వెయ్యి కోట్ల విలువైన ఆస్తి అని చెప్పి వైకాపా ఎమ్మెల్యే రూ.40కోట్ల వద్దే ఎందుకు ఆగిపోయారని ప్రశ్నించారు.