వచ్చే వారంలో ఎంపీ పదవికి రాజీనామా చేయనున్నాను అని ప్రకటించారు అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. ఎంపీ పదవికి రాజీనామా చేయబోతున్నాను అని ఇది వరకూ సూఛాయగా చెప్పిన దివాకర్ రెడ్డి ఇప్పుడు... రాజీనామాకు తేదీని కూడా ప్రకటించారు. ఈ నెల 25 వ తేదీన లేదా 26వ తేదీన తను రాజీనామా చేస్తానని ఆయన ప్రకటించారు. మరి పార్టీపై ఎలాంటి అసహనం లేని దివాకర్ రెడ్డి రాజీనామా చేస్తాను అని ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. తన నియోజకవర్గ అవసరాలను తీర్చడంలో తను ఫెయిల్ అని..అందుకే రాజీనామా చేస్తున్నాను అని దివాకర్ రెడ్డి చెప్పారు.
తన నియోజకవర్గం తాగు, సాగునీటి అవసరాలను తీర్చలేని తనకు ఎంపీ పదవి ఎందుకు? అని దివాకర్ రెడ్డి ప్రశ్నించారు. తన సొంత నియోజకవర్గం తాడిపత్రి తాగునీటి అవసరాలను కూడా తను తీర్చలేకపోతున్నాను అని దివాకర్ రెడ్డి అన్నారు. ఇలా ఫెయిల్ అయిన తనకు ఎంపీగా ఉండే అర్హత లేదని దివాకర్ రెడ్డి చెప్పారు. అందుకే రాజీనామా నిర్ణయానికి వచ్చానని చెప్పారు.
తను ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నప్పటికీ తెలుగుదేశం పార్టీకి మాత్రం రాజీనామా చేయడం లేదని దివాకర్ రెడ్డి ప్రకటించడం గమనార్హం. ఎంపీ పదవికి రాజీనామా చేసినా.. తను తెలుగుదేశంలోనే కొనసాగుతా అని ఆయన వివరించారు. మరి ఈ రాజీనామాను లోక్సభ స్పీకర్ కే పంపిస్తానని దివాకర్ రెడ్డి పేర్కొన్నారు. మరి ఎంపీగారి రాజీనామాకు టీడీపీ అధినేత చంద్రబాబు ఒప్పుకున్నారా?