ప్రయాణికులను ఆకట్టుకునేందుకు వివిధ నగరాల మధ్య లగ్జరీ డబుల్ డెక్కర్ బస్సులను నడిపేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దీని బాధ్యతలను రాష్ట్ర రహదారుల రవాణా సంస్థ(ఎస్ఆర్టీయూ)కు అప్పగించనుంది. దిల్లీ-ఆగ్రా, దిల్లీ-జయపుర, లఖ్నవూ-గోరఖ్పూర్, వడోదర-ముంబయి, శ్రీనగర్-జలంధర్, కోజికోడ్-కోచి, బెంగళూరు-మంగళూరు, విశాఖపట్నం-భువనేశ్వర్ సహా 75 మార్గాల్లో నడపాలని నిర్ణయించారు.
దీనిపై కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మంగళవారం ఆయా రాష్ట్ర రవాణా శాఖల మంత్రులకు సమాచారమిచ్చారు. ఈ తరహా రవాణాను ప్రోత్సహించేందుకు ఎస్ఆర్టీయూకు కేంద్రం ఆర్థికసాయం చేయనుంది. ‘ ప్రయాణికుల సంఖ్యకు తగ్గట్లుగా బస్సులు పెంచుతుండటంతో రహదారులపై రద్దీ పెరిగిపోతోంది. అందువల్లే డబుల్ డెక్కర్ బస్సులు ప్రవేశపెట్టాలని నిర్ణయించాం. వీటి ద్వారా కెపాసిటీ పెరగడంతో పాటు లాభాలు అందుకోవచ్చు’ అని అధికారులు తెలిపారు.
బస్సు ప్రయాణంపై ప్రజల్లో ఆసక్తి తగ్గుతున్నట్లు తాజా సర్వేలో తేలింది. 2016లో 45శాతమున్న బస్సు ప్రయాణికుల సంఖ్య 2017లో 40 శాతానికి తగ్గిపోయింది. అదే కారుల్లో ప్రయాణించే వారు 55 శాతం నుంచి 60శాతానికి పెరిగారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రయాణికులను ఆకర్షించేందుకు డబుల్ డెక్కర్ బస్సులు ప్రవేశపెట్టనున్నట్లు అధికారులు చెబుతున్నారు.