ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జిల్లాల వికేంద్రీకరణపై వైసీపీ సంఘీభావ ర్యాలీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jan 27, 2022, 02:00 PM

రాష్ట్రంలో జిల్లాల వికేంద్రీకరణ శుభపరిణామమని, ఇంతటి ప్రతిష్టాత్మకమైన నిర్ణయం తీసుకొన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు వైసీపీ మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి, రోడ్డు అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ రామాంజనేయులు, వైసీపీ జిల్లా కార్యవర్గ సభ్యులు బొగ్గుల తిక్కన్న, కోసిగి మార్కెట్ యార్డు ఉపాధ్యక్షులు ముక్కరన్న స్పష్టం చేశారు.


ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి నూతన జిల్లాల ఏర్పాటు చేస్తూ జిల్లాల వికేంద్రీకరణకు శ్రీకారం చుట్టినందుకు సంఘీభావం తెలుపుతూ గురువారం పెద్దకడబూరులో ఎస్సీ కాలనీ నుండి బస్టాండ్ లోని వైఎస్ఆర్ విగ్రహం వరకు సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా నినాదాలు చేశారు. అనంతరం దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి ఒక్క గ్రామం అభివృద్ధి జరగాలంటే ప్రజా సంకల్ప యాత్రలో ఇచ్చిన మాటకు కట్టుబడి జిల్లాల వికేంద్రీకరణకు శ్రీకారం చుట్టడం సంతోషకరమన్నారు.


రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా జిల్లాలు పునర్విభజన జరగాలని నిర్ణయించుకొని, తెలుగు ప్రజల పరిపాలన సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకొని జిల్లాల వికేంద్రీకరణ జరిగినప్పుడే ప్రజలకు అవసరమైన అన్ని సంక్షేమ పథకాలు అందుతాయని తెలిపారు. డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ చెప్పిన విధంగా ప్రజల సంక్షేమమే ధ్యేయంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేస్తున్నారని పేర్కొన్నారు. అలాగే ప్రతిపక్ష నాయకులకు కనువిప్పు కలిగేలా కృష్ణా జిల్లాకు స్వర్గీయ కీర్తి శేషులు నందమూరి తారక రామారావు పేరు పెట్టడం జరిగిందని, రాష్ట్రంలో ఎన్టీఆర్ ప్రజలకు చేసిన మంచి కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని ఆ జిల్లాకు ఆయన పేరు పెట్టడానికి నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.


ఆంధ్ర రాష్ట్ర ప్రజల మేలు కోసం పార్టీలకు అతీతంగా జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమం అనంతరం ఉద్యోగులు పీఆర్సీ గురించి ఎలాంటి ఆందోళనలు చేయవద్దని ప్రతి ఒక్క శాఖ ఉద్యోగులకు ముఖ్యమంత్రి ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంటారని హితవు పలికారు. అలాగే ఓమిక్రాన్ మూడవదశ వ్యాపిస్తుండడం వలన మండలంలోని ప్రజలు ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి ఈ వ్యాధి బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు.


ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ విజేయేంద్రరెడ్డి, నాయకులు అర్లప్ప, దస్తగిరి, ఈరన్న, కోరి నరశింహులు, శాంతిమూర్తి, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa