ముంబై: మహానగరం ముంబై భారీ వర్షాలకు స్తంభించిపోయింది. మంగళవారం కురిసిన వర్షం వల్ల జనజీవనం అస్తవ్యస్తమైంది. ఇవాళ కూడా భారీ స్థాయిలో వర్షం పడే సూచనలు ఉన్నాయి. దీంతో అక్కడ స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. నగరంలోని వీధులన్నీ నీటితో నిండిపోయాయి. సబర్బన్ రైళ్లు మంగళవారం రాత్రి ఎక్కడిఎక్కడే నిలిచిపోయాయి. అయితే ఇవాళ మధ్యాహ్నాం మళ్లీ వర్షం భారీగా కురిసే అవకాశాలు ఉన్న కారణంగా కొన్ని రైళ్లను రద్దు చేశారు. రానున్న 24 గంటల్లో ముంబైకి సమీపంలో ఉన్న రాయిగడ్ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షం పడే అవకాశాలున్నాయి. ముంబైలో మంగళవారం రాత్రి 11.30 నిమిషాల వరకు సుమారు 225.3 ఎంఎం వర్షం నమోదు అయ్యింది. ఇంత వర్షపాతం ఎక్స్ట్రీమ్ వెదర్ కిందకు వస్తుందని వాతావరణశాఖ వెల్లడించింది. కేవలం సాయంత్రం 5.30 నుంచి 8.30 మధ్య సుమారు 100 మిల్లీమీటర్ల వర్షం పడినట్లు అంచనా వేస్తున్నారు.
ముంబైలో ఈనెలలో గత 12 గంటల్లోనే అత్యధిక వర్షంపాతం మంగళవారమే నమోదు అయ్యింది. నారీమన్ పాయింట్, వర్లీ, చెంబుర్, ములంద్, అందేరీ, బాంద్రా, బొరివ్లీ ప్రాంతాల్లో భారీ స్థాయిలో వర్షం నమోదైంది. స్కూళ్లు, కాలేజీలను ఇవాళ మూసివేస్తున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ముంబై ఎయిర్పోర్ట్లోని ప్రధాన రన్వేను మూసివేశారు. ప్రస్తుతం సెకండ్ రన్వేను వాడుతున్నారు. మొత్తం 56 విమానాలను డైవర్ట్ చేశారు. పశ్చిమ రైల్వే మొత్తం ఆరు రైళ్లను రద్దు చేసింది. మరో రెండు రైళ్లను సెంట్రల్ రైల్వే రూట్లో దారి మళ్లించారు. ఇవాళ ఫేమస్ డబ్బవాలాలు కూడా పనికి గుడ్బై చెప్పారు. భారీ వర్షాల వల్ల డబ్బాలు ఇవాళ సరఫరా చేయలేమని ఆ సంఘం పేర్కొన్నది.