అనంతపురం రైల్వే స్టేషన్ లో ప్రమాదవశాత్తు తుపాకీ పేలి తీవ్రకలకలం రేపింది. ఘటన వివరాల్లోకి వెళ్తే... హుబ్లీ నుంచి మైసూర్ వెళ్తున్న హంపీ ఎక్స్ప్రెస్ లో గుంతకల్లు నుంచి అనంతపురం వరకు ఎస్కార్టు విధుల్లో భాగంగా ఆర్పీఎఫ్ కానిస్టేబుళ్లు రామచంద్రప్ప, రఫీ వచ్చారు. వీరు ట్రైన్ ఆగడంతో అనంతపురం రైల్వేస్టేషన్ లో కిందికి దిగారు. ఇంతలో ఒక ప్రయాణికుడు వేగంగా పరుగెత్తుకుంటూ వచ్చి రైలు ఎక్కేశాడు. ఈ క్రమంలో ఆయన రామచంద్రప్పని తాకుతూ వెళ్లాడు. ఆ జర్క్ కి ఆయన చేతిలోని తుపాకీ కిందపడింది. వెంటనే అన్ లాక్ అయి దాని నుంచి బుల్లెట్ బయటకు వచ్చింది. అది నేరుగా రామచంద్రప్ప కాలులోంచి దూసుకెళ్లి, రఫీ తొడలో దిగబడింది. దీంతో వారిద్దరూ గాయపడ్డారు. వారిని హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు.