నంద్యాల: ప్రజల గుండెల్లో చిరకాలం నిలిచిపోవాలన్నదే తన ఆకాంక్ష అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అందుకే ప్రజల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తున్నానని చెప్పారు. కర్నూలు జిల్లా నంద్యాలలో నిర్వహించిన బహిరంగ సభకు అధిక సంఖ్యలో విచ్చేసిన పొదుపు సంఘాల మహిళలనుద్దేశించి ప్రసంగించారు.
ప్రజల గుండెల్లో శాశ్వతంగా చోటు సంపాదించాలనే ఉద్దేశంతోనే తాను రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నానని చెప్పారు. గడిచిన మూడేళ్లలో దేశంలో ఏ రాష్ట్రంలోనూ జరగని అభివృద్ధి ఆంధ్రప్రదేశ్లో జరిగిందన్నారు. రాయలసీమను రతనాల సీమగా మారుస్తానని హామీ ఇచ్చానని, అది నెరవేరుస్తానని స్పష్టంచేశారు.
రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంటే అవాస్తవాలను ప్రతిపక్షం ప్రచారం చేస్తోందన్నారు. రాయలసీమను హార్టికల్చర్ హబ్గా మారుస్తానని హామీ ఇచ్చారు. ఎన్నికలను తాను ఎప్పుడూ రాజకీయ కోణంలో చూడడం లేదని, ప్రజలు ఆనందంగా ఉండాలన్నదే తన ఆశయమని పేర్కొన్నారు. మహిళలు తమ కాళ్లపై తాము నిలబడాలన్న ఉద్దేశంతో డ్వాక్రా సంఘాలు ప్రవేశపెట్టానని గుర్తుచేశారు. సాంకేతికతను ఉపయోగించి వాస్తవ లబ్ధిదారులకు సంక్షేమ ఫలాలు అందేలా కృషి చేస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో దెయ్యాలు కూడా పింఛన్లు తీసుకున్నాయని దుయ్యబట్టారు. రాబోయే ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీకి డిపాజిట్ కూడా దక్కకుండా చేయాలన్నదే తన ఆశయమని చెప్పారు.