న్యూయార్క్: న్యూయార్క్ వెళ్లిన భారత విదేశాంగశాఖ మంత్రి సుష్మా స్వరాజ్ సోమవారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంక ట్రంప్ను కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇరువురు నవంబర్లో జరగనున్న గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ సమ్మిట్(జీఈఎస్) గురించి చర్చించారు. ఈ విషయాన్ని ఇవాంక ట్రంప్ ట్విటర్ ద్వారా తెలియజేశారు. ‘మహిళా వ్యవస్థాపకత, యూఎస్-భారత్లో శ్రామికాభివృద్ధికి సంబంధించి చర్చలు జరిపాం’ అని ఇవాంక తెలియజేశారు. ఈ సందర్భంగా సుష్మాస్వరాజ్ను ‘ఆకర్షణీయమైన’ విదేశాంగ మంత్రిగా అభివర్ణించారు.
సుష్మాస్వరాజ్ను కలుసుకోవడం ఎంతో గౌరవంగా భావిస్తున్నట్లు ఇవాంక తెలిపారు. హైదరాబాద్లో వచ్చే నెల 28 నుంచి 30 వరకు జరగనున్న జీఈఎస్ సదస్సుకు ఇవాంక అధ్యక్షత వహించనున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె వచ్చే నెలలో భారత్లో పర్యటించనున్నారు.
వారం రోజుల పర్యటన నిమిత్తం సుష్మాస్వరాజ్ అమెరికా వెళ్లారు. ఈనెల 23న ఐరాస సర్వప్రతినిధుల సభ 72వ వార్షిక సమావేశంలో ఆమె పాల్గొని ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా పలు దేశాధినేతలతో ద్వైపాక్షిక, త్రైపాక్షిక చర్చల్లో ఆమె పాల్గొననున్నారు.