చెన్నై: యువ ఆటగాడు హార్దిక్ పాండ్యపై భారత క్రికెట్ జట్టు సారథి విరాట్ కోహ్లీ ప్రశంసల వర్షం కురిపించాడు. ఐదు వన్డేల సిరీస్లో భాగంగా ఆదివారం జరిగిన తొలి వన్డేలో పాండ్య అద్భుత ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.
మ్యాచ్ అనంతరం కోహ్లీ మీడియాతో మాట్లాడుతూ.. ‘టాస్ గెలిచినప్పుడు ప్రత్యర్థుల ముందు భారీ లక్ష్యం ఉంచడమే ఇక తరువాయి అనుకున్నాను. దురదృష్టవశాత్తూ మ్యాచ్ ఆరంభంలోనే వికెట్లు కోల్పోయాం. కానీ, ధోనీ, కేదార్ జాదవ్ ఇన్నింగ్స్ చక్కదిద్దారు. ఆ తర్వాత హార్దిక్-ధోనీ కలిసి పరుగులు రాబట్టి భారత్కు మంచి స్కోరు అందించారు. మిడిల్, లోయర్ ఆర్డర్లో మన జట్టు ఎంత బలంగా ఉందో చెప్పడానికి ఇదే మంచి ఉదాహరణ. హార్దిక్ తనను తాను నమ్ముతాడు. ఈ మ్యాచ్లో అతని ఇన్నింగ్స్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసింది. అతనో గేమ్ ఛేంజర్. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాల్లో పాండ్య రాణించాడు. బౌలర్లు చాహల్, భువి, బుమ్రా అద్భుత ప్రదర్శన చేశారు. తక్కువ స్కోరుకే వారిని కట్టడి చేయగలిగారు.’ అని కోహ్లీ తెలిపాడు.
భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన తొలి వన్డేలో పాండ్య 66 బంతుల్లో 83 పరుగులు సాధించిన సంగతి తెలిసిందే. అంతేకాదు నాలుగు ఓవర్లు వేసిన పాండ్య స్మిత్, హెడ్ వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అటు బ్యాటింగ్లో.. ఇటు బౌలింగ్లో రాణించి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు.